
అమరావతి, 11 మే (హి.స.)
ఏపీ రాజకీయాలపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఇప్పుడు ఒక బలమైన మూడో ప్రత్యామ్నాయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన చేసిన తాజా ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర రాజకీయాలు రెండు విచిత్ర ధోరణుల మధ్య చిక్కుకుపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి టీడీపీ, వైసీపీల విధానాలను విమర్శించారు. ఒకవైపు గ్రామీణ ప్రాంతాలను విస్మరించే టీడీపీ పట్టణ కేంద్రీకృత దృక్పథం, మరోవైపు అభివృద్ధిపై దార్శనికత లేని వైసీపీ కేవలం సంక్షేమ విధానం.. ఈ రెండు తీవ్ర ధోరణుల మధ్య ఏపీ రాజకీయాలు నలిగిపోతున్నాయి అని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రానికి ఎలాంటి నాయకత్వం అవసరమో కూడా ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమాలను సమన్వయం చేసే విశ్వసనీయమైన మూడో ప్రత్యామ్నాయం ఏపీకి కావాలని ఆయన ఆకాంక్షించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తూనే, వాటి ఫలాలను రాష్ట్రంలోని ప్రతీ ప్రాంతానికి చేరేలా చూసే నాయకత్వం రావాలని విజయసాయి రెడ్డి తన ట్వీట్లో వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi