నల్లమలలో రాజుకున్న కార్చిచ్చు.. అటవీ సంపద అగ్నికి ఆహుతి
నల్లమలలో రాజుకున్న కార్చిచ్చు.. అటవీ సంపద అగ్నికి ఆహుతి
wildfire-rages-in-nallamala-forest-wealth-consumed-by-flames-548437


శ్రీశైలం, 11 మే (హి.స.) భానుడి ప్రతాపంతో నల్లమల అటవీ ప్రాంతాన్ని మంటలు చుట్టుముట్టాయి. శ్రీశైలం (Srisailam) సమీపంలోని శిఖరేశ్వరం (Shikhareshwaram) అటవీ ప్రాంత పరిధిలో ఆదివారం అర్ధరాత్రి భారీగా కార్చిచ్చు చెలరేగింది. ఎండల వేడికి ఎండిపోయిన చెట్లు, ఆకులు ఒకదానికొకటి రాపిడికి గురై మంటలు వ్యాపించడంతో భారీగా అటవీ సంపద అగ్నికి ఆహుతైంది. శిఖరేశ్వరం సమీపంలోని అటవీ ప్రాంతంలో హఠాత్తుగా మంటలు చేలరేగాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో క్షణాల్లోనే మంటలు అడవి అంతటా విస్తరించాయి. భారీగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మంటల ధాటికి విలువైన వృక్ష సంపదతో పాటు ఔషధ మొక్కలు కాలి బూడిదయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు మరింత విస్తరించకుండా అగ్నిమాపక యంత్రాలతో తీవ్రంగా శ్రమించారు. నీటిని వెదజల్లడంతో పాటు అటవీ శాఖ సిబ్బంది ప్రత్యేక పద్ధతుల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో స్పందించడంతో భారీ ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వేసవి కాలం కావడంతో అటవీ ప్రాంతంలో నిరంతరం నిఘా ఉంచుతున్నామని, ప్రజలు అడవిలో మంటలు చెలరేగే పనులు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande