
హైదరాబాద్, 12 మే (హి.స.)బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల డిమాండ్ నేపథ్యంలో నిర్వహించిన రైల్ రోకో కార్యక్రమం కేసులో తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు (Kalvakuntla Kavitha) సమన్లు జారీ అయ్యాయి. రేపు (బుధవారం) విచారణకు హాజరు కావాలని సికింద్రాబాద్ రైల్వే కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
బీసీ రిజర్వేషన్ల కోసం రైల్ రోకో
కొంతకాలం క్రితం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కవిత ఆధ్వర్యంలో రైల్ రోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే రవాణాకు అంతరాయం కలిగిందని రైల్వే ఏఎస్ఐ రవీంద్రబాబు ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. రేపు ఉదయం 10:30కి సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. దేవగిరి ఎక్స్ప్రెస్తో పాటు గూడ్స్ రైలు నిలిపివేతపై రైల్వే యాక్ట్ 147 & 74(a) సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. రైల్ రోకోతో నిజామాబాద్–హైదరాబాద్ రూట్లో అంతరాయం ఏర్పడింది.
కవితతో పాటు 12 మంది నేతలపై కేసులు..
ఈ కేసులో కవితతో పాటు మరో 12 మంది బీఆర్ఎస్ నాయకులపై కూడా కేసులు నమోదయ్యాయి. రైల్వేచట్టాల ఉల్లంఘన, ప్రజా రవాణాకు ఆటంకం కలిగించడం వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
కవిత హాజరుపై ఉత్కంఠ..
ఈ కేసు విచారణలో భాగంగా రేపు(బుధవారం) సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు కవిత, బీఆర్ఎస్ నేతలు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఈ కేసులో తదుపరి విచారణ సందర్భంగా కోర్టు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాజకీయంగా ప్రాధాన్యం..
బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన నేపథ్యంలో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ నేతలు బీసీల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని చెబుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్