
హైదరాబాద్, 12 మే (హి.స.)దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రద్దు కావడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మే 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను రద్దు చేశారని అన్నారు. నీట్ పరీక్ష రద్దుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కేంద్ర మానవ వనరుల శాఖ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రద్దుతో విద్యార్థులు తమ అకడమిక్ ఇయర్ను కోల్పోయే అవకాశం ఉందన్నారు. నీట్ పరీక్ష రద్దుపై బీజేపీ ప్రభుత్వం చర్చ చేపట్టాలన్నారు.
దేశంలో అనేక విషయాలపై చర్చ చేసే బీజేపీ విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై సమాధానం చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. బీజేపీకి పాలనపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తు, సామాన్యుడి అవసరం బీజేపీకి వద్దా అని నిలదీశారు. నీట్ పరీక్ష రద్దుకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్లు ఇప్పించి నీట్ పరీక్ష రాయించారని తెలిపారు. రాజస్థాన్లో నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్రం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలన్నారు. విద్యార్థుల అకడమిక్ ఇయర్ దెబ్బతినకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్