
చిత్తూరు, 12 మే (హి.స.)చిత్తూరు నగరంలో నడివీధి గంగమ్మ జాతర వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వంశపారంపర్య ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబ సభ్యులు తొలి పూజ నిర్వహించి.. ఈ జాతర వేడుకలను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దంపతులు కూడా ఈ తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ జాతర వేడుకల్లో మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పోటెత్తారు.
జాతర మంగళ, బుధవారం రెండు రోజులపాటు కొనసాగనుంది. స్థానికలే కాకుండా.. పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ జాతరకు తరలి వస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు.
ఈ జాతర నిర్వహించే బజారువీధి, కొంగారెడ్డిపల్లె, మురకంబట్టు, గిరింపేట తదితర ప్రాంతాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు. గంగమ్మ జాతర జరిగే ప్రాంతాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV