
నెల్లూరు, 12 మే (హి.స.) : శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం పురాతనమైన, పవిత్రమైన ఆలయమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో దేవాలయాలకు భద్రత కొరవడిందని.. విధ్వంసాలు సృష్టించారని ధ్వజమెత్తారు. ఈరోజు నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడారు.
వైసీపీ హయాంలో సనాతన ఆచార వ్యవహారాలను, ధర్మాలను అపహాస్యం చేశారని మంత్రి ఆనం ఆగ్రహించారు. భక్తులు ఆలయాలకు వెళ్లటమే మానేసేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తిరిగి ఆధ్యాత్మిక శోభ తీసుకురావాలని సీఎం చంద్రబాబు సంకల్పించారని అన్నారు. 700 ఆలయాలను రూ.823 కోట్లతో పునరుద్ధరిస్తున్నామని చెప్పుకొచ్చారు. రూ.750 కోట్లతో రాష్ట్రంలో ఐదువేల భజన మందిరాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు గ్రీన్సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. రూ.113 కోట్లతో 617 భజన మందిరాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV