
హైదరాబాద్, 24 మే (హి.స.)
తెలంగాణలో ఎండల తీవ్రత ఆందోళన
కలిగిస్తోంది. శనివారం ఒక్కరోజే ఎండల కారణంగా వడదెబ్బతో 22 మంది మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు రోజుల్లో 38 మంది మరణించారు. ఇక నిన్న ఒక్కరోజే తెలంగాణలో వడదెబ్బతో 51 మంది మరణించారు. మూడు రోజుల్లో రాష్ట్రంలో 107 మంది చనిపోయారు. అంతేకాకుండా శనివారం 32 జిల్లాల్లోనూ 40 నుండి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైనట్టు సమాచారం. భద్రాద్రి, జగిత్యాల, సూర్యాపేట, ఖమ్మం, మంచిర్యాల, ములుగు, కొమురం భీం జిల్లాలో 46 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరోవైపు ఈ నెల 27 వరకు రాష్ట్రంలో ఎండలు భారీగానే ఉంటాయని, వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, వరంగల్ లో హీట్ వేవ్ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఎండల తీవ్రత దృష్యా ప్రజలు అవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వైద్యులు చెబుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. వడదెబ్బ తగిలితే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని, ఇంట్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు