
రాజన్న సిరిసిల్ల, 24 మే (హి.స.)
ఈత సరదా విషాదంగా మారకూడదని, చిన్న చిన్న నిర్లక్ష్యాలే ప్రాణనష్టానికి దారితీయవచ్చునని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో ఎంతో మంది పిల్లలు యువకులు ఎండ వేడి నుంచి సేద తీరటానికి, ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాలువల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉందన్నారు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణనష్టం జరుగుతుందని, పిల్లల ఈత సరదా విషాదంగా మారకూడదన్నారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని, ఈత నేర్చుకునే వారు తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువులు, కాలువల, కుంటలు వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రకటనలో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు