
మెదక్, 24 మే (హి.స.)
కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి
ధాన్యం కొనుగోలు చేయాలని మెదక్ జిల్లా బిజెపి నాయకులు మండిపడ్డారు. ఆదివారం వారు నర్సాపూర్ మండలం నాగులపల్లి, మూసాపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా బిజెపి అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో ప్రతి గ్రామంలో ఐకేపీ సెంటర్ల వద్ద కుప్పలు కుప్పలుగా వడ్లు నెల రోజులుగా సెంటర్లోనే పడి ఉన్నాయన్నారు. ఎక్కడ కూడా రైతుల నుంచి వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదన్నారు. తెలంగాణ సీఎం కలెక్టర్లకు వారంలోపు వడ్లను కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లేదంటే రైతుల పరిస్థితి అధోగతి పాలు అవుతుందన్నారు. ఐకేపీ సెంటర్లలో సంచులు, కూలీల సమస్యలను ఇప్పటికైనా పరిష్కరించాలన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడానికి బీజేపీ రాష్ట్ర పార్టీ మూడు బృందాలుగా ఏర్పడి అన్ని ఐకెపి సెంటర్లను, రైతులను కలవడం జరుగుతుందనీ పేర్కొన్నారు. రైతుల కోసం పెద్ద ఎత్తున ఆందోళన, ధర్నాలకైనా బిజెపి పార్టీ ముందుంటుందని తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు