
నంద్యాల, 25 మే (హి.స.)
నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం ఎస్.ఎన్ తాండా సమీపంలో త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. మొక్కజొన్న లోడ్తో వెళ్తున్న ఓ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మాచర్ల నుంచి కర్నూలు హైవేపై లారీలో వెళ్తుండగా మంటలు అంటుకున్నాయి. లారీ టయర్లు ఒకదానికొకటి రాపిడికి గురికావడంతోనే ఈ మంటలు వచ్చాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో డ్రైవర్, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
అయితే సమీపంలో వెళ్తున్న వాహనదారులు, స్థానికులు అప్రమత్తమై సమయస్ఫూర్తితో స్పందించారు. వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించి పెద్ద ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారు. స్థానికుల సహకారంతో మంటలు అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లారీలో మంటలు చెలరేగడంతో కొంతసేపు హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV