టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం.. బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం.. బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
GSRTC


హైదరాబాద్, 25 మే (హి.స.)

ప్రయాణికుల భద్రతను పెంచే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక అడుగు వేసింది. 'బస్సులో భరోసా' పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బస్సుల్లో అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. తొలి దశలో భాగంగా ఈ పైలట్ ప్రాజెక్టును ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించింది.

ఈ పైలట్ ప్రాజెక్టు కింద ఆదిలాబాద్ రీజియన్లోని 175 బస్సుల్లో హైటెక్ నిఘా కెమెరాలను అమర్చారు. పోలీసు శాఖ సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం ద్వారా బస్సుల్లోని దృశ్యాలను ఆర్టీసీ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తారు. బస్సుల్లో దొంగతనాలు, మహిళలపై వేధింపులు, పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలు, వృద్ధులకు ఈ వ్యవస్థ భరోసా కల్పించనుంది.

ఈ కార్యక్రమంపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులకు సురక్షిత ప్రయాణాన్ని అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినుల రక్షణకు ఈ కెమెరాలు ఒక 'రక్షణ కవచం'లా పనిచేస్తాయని తెలిపారు. ఈ కెమెరాల ఏర్పాటుతో ప్రయాణికులకు భద్రత పెరగడంతో పాటు, సిబ్బంది పనితీరులో జవాబుదారీతనం కూడా మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో అమలవుతున్న ఈ పైలట్ ప్రాజెక్టు ఫలితాలను సమీక్షించి, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సుల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande