
మహబూబ్నగర్, 26 మే (హి.స.) మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున దొంగల ముఠా ఏటీఎంను ధ్వంసం చేసి నగదును దోచుకు వెళ్లారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంను ధ్వంసం చేసే ఉద్దేశంతో ముందుగా సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు, తదితరాలను దొంగలు ధ్వంసం చేశారు. అనంతరం ఏటీఎంను పగలగొట్టి అందులో ఉన్న నగదును దోచుకెళ్ళారు. ఉదయం విషయం బహిర్గతం కావడంతో సంబంధిత బ్యాంకు అధికారులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల షాద్ నగర్ లో ఏటీఎం ను పగలగొట్టి దొంగతనానికి పాల్పడిన ముఠాయే ఈ పని చేసి ఉండవచ్చు అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు క్లూస్ టీం సహకారంతో వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా కేంద్రం నడిగడ్డన సంఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..