
గోవా27 మే (హి.స.)
పర్యాటక స్వర్గధామం గోవాలో 'ట్యాక్సీ మాఫియా' ఆగడాలు మరోసారి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కేవలం నాలుగు కిలోమీటర్ల ప్రయాణానికి రూ. 800 డిమాండ్ చేయడంతో ఓ పర్యాటకుడు తన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అధిక చార్జీలు, యాప్ ఆధారిత సర్వీసులను అడ్డుకోవడం, డ్రైవర్ల బెదిరింపు ధోరణి వంటివి రాష్ట్ర పర్యాటక ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గోవా ట్యాక్సీ వాళ్లకు ఏమైంది? నిన్న నాలుగు కిలోమీటర్లకు రూ. 800 అడిగారు అంటూ రెడ్డిట్లో ఓ యూజర్ పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'గోవా మైల్స్' యాప్ కూడా సరిగ్గా పనిచేయడం లేదని ఆయన వాపోయారు. యాప్లో డబ్బులు ముందుగా యాడ్ చేస్తే కానీ ట్యాక్సీ బుక్ కాదు. డబ్బులు వేసినా డ్రైవర్లు రారు. రిఫండ్ రావడానికి 8 రోజులు పడుతుంది. గోవా చాలా అందమైన ప్రదేశం, కానీ ఈ ట్యాక్సీ వ్యవస్థ భారతదేశ పర్యాటక రాజధాని పేరును చెడగొడుతోంది అని ఆయన పేర్కొన్నారు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు తమ అనుభవాలను పంచుకున్నారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తే, రోజుకు రెండు మూడు ట్రిప్పులతోనే ఎక్కువ సంపాదించవచ్చని, మిగతా రోజంతా ఖాళీగా ఉండొచ్చని డ్రైవర్లు భావిస్తారు అని ఒకరు కామెంట్ చేశారు. ఊబర్ వంటి వాటిని అనుమతించకపోవడంతో స్థానిక డ్రైవర్లకే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.
ఇదే తరహాలో ఈ నెలలో జరిగిన మరో ఘటనను కూడా పలువురు ప్రస్తావించారు. ట్యాక్సీ సమస్యల కారణంగా కారు అద్దెకు తీసుకున్న ఓ పర్యాటకుల బృందాన్ని స్థానిక క్యాబ్ డ్రైవర్లు బెదిరించారు. తమ కారును ఓ క్యాబ్ డ్రైవర్ ఢీకొట్టి, తప్పు ఒప్పుకోకుండా తన స్నేహితులను పిలిచి వాగ్వాదానికి దిగాడని ఓ పర్యాటకుడు వివరించారు. ఈ గొడవతో ట్రిప్ మూడ్ దెబ్బతిని, ప్రయాణాన్ని మధ్యలోనే రద్దు చేసుకుని వెనుదిరిగినట్లు తెలిపారు. మొత్తంమీద, అధిక చార్జీలు, డ్రైవర్ల దురుసు ప్రవర్తన వంటివి గోవా పర్యాటక రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని పర్యాటకులు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi