
డిల్లీ, 29 మే (హి.స.)
దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులను మూడు నెలల్లో వెలువరించాలని స్పష్టం చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో తీర్పు ఇవ్వడంలో జాప్యం కారణంగా పిటిషనర్లకు పూడ్చలేని నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి కేసులలో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
బెయిల్ దరఖాస్తులపై తీర్పులను అదే రోజు వెలువరించాలని, ఒకవేళ వాటిని రిజర్వ్ చేస్తే మరుసటి రోజు వెలువరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాఘ్చీ, జస్టిస్ విపిన్ పంచోలితో కూడిన ధర్మాసనం పేర్కొంది.
గత సంవత్సరం ఝార్ఖండ్ హైకోర్టు వెలువరించిన తీర్పును వెబ్ సైట్లో అప్ లోడ్ చేయడంపై వచ్చిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు, పలు అంశాలపై హైకోర్టులకు మార్గదర్శకాలు జారీ చేసింది.
- వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశాల్లో మూడు నెలల కంటే ముందే తీర్పును వెలువరించాలి.
- బెయిల్ దరఖాస్తులపై తీర్పును అదే రోజు వెలువరించాలి. ఒకవేళ తీర్పును రిజర్వ్ చేస్తే మరుసటి రోజు వెలువరించాలి.
- విచారణ ఖైదీలను బెయిల్ లభించిన రోజు లేదా మరుసటి రోజు విడుదల చేయాలి.
- తీర్పులో అమలు చేయాల్సిన భాగాన్ని మాత్రమే ఓపెన్ కోర్టులో వెల్లడించాలి. తీర్పు కాపీని ఏడు రోజుల్లో వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయాలి.
- తీర్పు ఇచ్చే తేదీని హైకోర్టు వెబ్ సైట్లలో స్పష్టంగా పేర్కొనాలి.
- ఈ మార్గదర్శకాలను అమలు చేయడానికి హైకోర్టుల వెబ్సైట్లలో తగిన మార్పులు చేయాలి. ఈ మార్పులను సంబంధిత హైకోర్టుల చీఫ్ జస్టిస్లో పర్యవేక్షణలో ఇది జరగాలి.
- తీర్పును రిజర్వ్ చేసిన మూడు నెలల్లో వెలువరించాలి. అప్పటికి తీర్పు వెలువడకపోతే రిజిస్ట్రార్ చీఫ్ జస్టిస్ ఎదుటకు తీసుకువెళ్లాలి. చీఫ్ జస్టిస్ మరో రెండు వారాల సమయం ఇచ్చి, అప్పటికీ తీర్పు రాకపోతే ఆ కేసును మరో బెంచ్కు కేటాయించాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi