
న్యూఢిల్లీ, 29 మే (హి.స.)
డిజిటల్ కరెన్సీని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిటైల్ రంగానికి కూడా విస్తరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యోచిస్తోంది. డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని విస్తృతం చేయనున్నట్లు ఆర్బీఐ తన వార్షిక నివేదికలో పొందుపరిచింది. ఈ క్రమంలో డిజిటల్ కరెన్సీ పైలట్ ప్రాజెక్టును మరింత విస్తరించనుంది.
2025-26 ఆర్థిక సంవత్సరాలలో గుజరాత్, పుదుచ్చేరి, చండీగఢ్లలో నగదు బదిలీ పథకాల కింద డిజిటల్ కరెన్సీని ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు ఆర్బీఐ తెలిపింది. రేషన్ లబ్ధిదారులకు కూడా ఆహార సబ్సిడీని సీబీడీసీ ద్వారా అందించారు.
లబ్ధిదారులకు అందిన నిధులను రేషన్ షాపులు, ఎంపిక చేసిన వ్యాపారుల వద్ద వస్తువుల కొనుగోలుకు మాత్రమే ఉపయోగించేలా చూశారు. దీనిని మరింత విస్తరించాలని ఆర్బీఐ భావిస్తోంది. ఇకముందు సీబీడీసీ పైలట్ ప్రాజెక్టులో మరింత మందిని భాగస్వాములుగా చేయాలని భావిస్తున్నట్లు ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi