
అమరావతి, , 28 మే (హి.స.)
:ఏపీలో సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన కేఎన్ఆర్ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. దీంతో ఆయన ఈరోజు (గురువారం) విచారణకు హాజరయ్యారు. నిన్న కూడా సిట్ అధికారులు జగన్ పీఏను విచారించిన విషయం తెలిసిందే. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
మద్యం కుంభకోణంలో భారీస్థాయిలో అక్రమాలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో లిక్కర్ ముఠా, వైసీపీ అధినేత మధ్య కెఎన్ఆర్ కీలక వారధిగా వ్యవహరించారని సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై అధికారులు సమగ్రంగా విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, కీలక వ్యక్తులతో సంబంధాలు, అనుమానాస్పద ఒప్పందాలపై సిట్ అధికారులు కేఎన్ఆర్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. రెండోరోజు విచారణలో కూడా పలు కీలక అంశాలపై అధికారులు సమాధానాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం వరకు విచారణ కొనసాగనుంది.
అనంతరం ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ మద్యం కుంభకోణం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో మరికొంతమంది కీలక వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశముందని సిట్ అధికారులు చెబుతున్నారు. సిట్ దర్యాప్తు వేగవంతం కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠత నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ