
అలహాబాద్, 28 మే (హి.స.)
దేశంలో హుక్కా బార్ల (Hookah Bars) నిర్వహణపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రాష్ట్రంలో హుక్కా బార్ల నిర్వహణకు అనుమతులు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ, వ్యాపారం చేసుకునే తమ హక్కుకు భంగం కలుగుతోందంటూ పలువురు నిర్వాహకులు దాఖలు చేసిన పిటిషన్లను ఇవాళ హైకోర్టు విచారించింది. అయితే పక్షాల వాదనలు విన్న ధర్మాసనం హుక్కా బార్లను నడపడం అనేది భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కు (Fundamental Right) కిందకు రాదని స్పష్టం చేసింది.
సమాజ హితం, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టకుని హుక్కా బార్లపై ఆంక్షలు విధించేలా సర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(G) ప్రకారం దేశంలో పౌరులకు నచ్చిన వ్యాపారం, వృత్తికి సంబంధించి పనులు చేసుకునే స్వేచ్ఛ ఉందని, అందుకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయని కోర్టు పేర్కొంది. యువత ఆరోగ్యాన్ని నాశనం చేస్తూ, ప్రజల ప్రాణాలకు హాని కలిగించే హుక్కా వ్యాపారాలకు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు వర్తించదని న్యాయమూర్తులు తీర్పును వెలువరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు