
న్యూఢిల్లీ, 28 మే (హి.స.)
దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ
(BJP) ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది. ఆయా రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఒకేసారి నాలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను మారుస్తూ బీజేపీ జాతీయ నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హర్యానా, పంజాబ్, త్రిపుర రాష్ట్రాలకు కొత్త సారథులను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కీలకమైన ఢిల్లీ స్టేట్ బీజేపీ చీఫ్ గా హర్ష్ మల్హోత్రాను అధిష్టానం నియమించింది. ఇక వ్యూహాత్మకంగా ప్రాధాన్యత ఉన్న హర్యానా రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్గా అర్చనా గుప్తాను నియమించి మహిళా నాయకత్వానికి బీజేపీ పెద్దపీట వేసింది. అలాగే, సుదీర్ఘ కాలంగా రాజకీయంగా పట్టుకోసం ప్రయత్నిస్తున్న పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా సీనియర్ నేత కేవాల్ సింగ్ దిల్లాన్ను నియమిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. వీరిద్దరి నియామకాలతో ఆయా రాష్ట్రాల్లో సరికొత్త రాజకీయ సమీకరణాలు ఊపందుకోనున్నాయి.
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో కూడా బీజేపీ నాయకత్వాన్ని మార్చింది. త్రిపుర రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా అభిషేక్ దేబ్రాయ్కు అధిష్టానం అవకాశం కల్పించింది. యువతకు, చురుకైన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ నియామకం జరిగినట్లుగా తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు