
తిరుమల, 29 మే (హి.స.)
వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమల తిరుపతి (Tirumala Tirupati) కొండపై భక్తుల రద్ధీ భారీగా కొనసాగుతోంది. తమ పిల్లలతో కలిసి మొక్కులు తీర్చుకునేందుకు నిత్యం వేలాది మంది వస్తుండటంతో తిరుమల భక్త జనసందోహం గా మారింది. ఈ క్రమంలోనే శుక్రవారం శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Queue Complex) లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. దీనివల్ల క్యూ కాంప్లెక్స్ వెలుపల ఉన్న క్యూలైన్లలో కూడా భక్తులు సుదీర్ఘ సమయం పాటు వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం (Sarvadarsanam) లభించడానికి సుమారు 20 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే గురువారం కూడా భక్తుల రద్ధీ కొనసాగగా.. నిన్న ఒక్కరోజే మొత్తం 74,569 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే స్వామివారికి తమ భక్తిని చాటుకుంటూ 46,292 మంది భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా రూ.3.8 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV