దళారులతో ఒప్పందం.. టీఎంసీ నేతల సాయం.. బంగ్లా వలసదారుల విషయంలో సంచలన నిజాలు!
దళారులతో ఒప్పందం.. టీఎంసీ నేతల సాయం.. బంగ్లా వలసదారుల విషయంలో సంచలన నిజాలు!
Suvendu Adhikari


కలకత్తా 29 మే (హి.స.)పశ్చిమ బెంగాల్లో అక్రమ వలసదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో వారిలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ తమను నిర్బంధ కేంద్రాలకు (డిటెన్షన్ సెంటర్స్) తరలిస్తారోనన్న భయంతో వందలాది మంది బంగ్లాదేశీ వలసదారులు స్వదేశానికి తిరుగుపయనమవుతున్నారు. దశాబ్దాలుగా, కొందరైతే పుట్టినప్పటి నుంచి ఇక్కడే నివసిస్తున్నప్పటికీ, ఇప్పుడు సరిహద్దు పాయింట్లు, రవాణా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో వారు భారత్లోకి ఎలా చొరబడ్డారు, ఇక్కడి పత్రాలను ఎలా సంపాదించారు అనే విషయాలపై సంచలన నిజాలను వెల్లడిస్తున్నారు.

దళారుల వ్యవస్థ.. పక్కా ప్రణాళికతో చొరబాటు

భారత్లోకి అక్రమంగా ప్రవేశించడం వెనుక ఒక వ్యవస్థీకృత నెట్వర్క్ పనిచేస్తోందని వలసదారుల మాటలను బట్టి స్పష్టమవుతోంది. రాత్రి వేళల్లో బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ కదలికలను దళారులు గమనిస్తుంటారు. వారి నిఘాలో ఏమాత్రం ఖాళీ (గ్యాప్) దొరికినా, పది నిమిషాల్లో మమ్మల్ని సరిహద్దు దాటించేస్తారు అని ఓ వలసదారుడు స్థానిక యూట్యూబ్ ఛానెల్తో చెప్పాడు. బంగ్లాదేశ్లోని కుష్టియా జిల్లాకు చెందిన ఒక వడ్రంగి, రూ.7,000 నుంచి రూ.8,000 వరకు దళారికి చెల్లించి భారత్లోకి ప్రవేశించినట్లు తెలిపాడు. బెంగళూరులో పట్టుబడిన మరో వలసదారుడు, సరిహద్దులో సైన్యం ఉన్నప్పటికీ రూ.20,000 ఏజెంట్కు చెల్లించి దేశంలోకి వచ్చినట్లు అంగీకరించాడు. ఈ దళారుల వ్యవస్థ నదులు, వ్యవసాయ భూములు, జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాలను తమ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకుంటోంది.

సరిహద్దు దాటిన తర్వాత భారత్లో జీవించడానికి అవసరమైన గుర్తింపు పత్రాలు పొందడంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన స్థానిక కార్యకర్తలు సహాయం చేశారని కొందరు వలసదారులు ఆరోపించడం కలకలం రేపుతోంది. మమతా బెనర్జీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాకు ఓటరు కార్డు, రేషన్ కార్డు వచ్చాయి. ఆ పార్టీ వాళ్లే ఇప్పించారు. లక్షీర్ భండార్ పథకం కింద రెండు, మూడేళ్లు నగదు సాయం కూడా అందుకున్నాను అని ఓ మహిళా వలసదారు ఏబీపీ న్యూస్కు వెల్లడించింది. మరో వ్యక్తి తాను ఒకసారి ఓటు వేశానని, తన భార్యకు కూడా లక్షీర్ భండార్ పథకం కింద డబ్బులు వచ్చాయని అంగీకరించాడు. ఇలా చొరబాటుదారులు భారత సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందడం దేశ ఖజానాపై అదనపు భారం మోపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ కఠిన చర్యలతో తిరుగుముఖం

పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సువేందు అధికారి అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వలసదారులకు ఆశ్రయం ఇవ్వకూడదు, వారిని కోర్టులో హాజరుపరచవద్దు. నేరుగా సరిహద్దులో బీఎస్ఎఫ్కు అప్పగించాలి అని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, వలసదారులు పొందుతున్న సంక్షేమ పథకాలను గుర్తించి, వాటిని రద్దు చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. లక్షీర్ భండార్ పథకంలో సుమారు 30 లక్షల మంది అనర్హులు ఉన్నారని, వారిని ఏరివేసినట్లు సువేందు అధికారి ఇటీవల తెలిపారు. ఈ కఠిన చర్యల వల్లే వలసదారులు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

వలసదారులు స్వదేశానికి తిరిగి వెళ్తున్నారన్న వార్తలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. చొరబాటుదారులు స్వచ్ఛందంగా తిరిగి వెళ్తున్నందున, వారిపై ప్రభుత్వం ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోదు అని ఆయన గురువారం ప్రకటించారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా చికెన్ నెక్ ప్రాంతంలో బీఎస్ఎఫ్కు 600 హెక్టార్ల భూమిని అప్పగించినందుకు సువేందు అధికారిని ఆయన అభినందించారు. ఇప్పటికే భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న 4,096 కిలోమీటర్ల సరిహద్దులో 79% ఫెన్సింగ్ పూర్తయిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మేఘాలయలో కూడా ఫెన్సింగ్ పనులు చివరి దశలో ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తెలిపారు.

ఏళ్లుగా వడ్రంగులుగా, తాపీ మేస్త్రీలుగా, ఇళ్లలో పనివాళ్లుగా ఇక్కడే స్థిరపడిన వారు ఇప్పుడు భవిష్యత్తుపై భయంతో, నిర్బంధ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుందనే ఆందోళనతో కట్టుబట్టలతో సరిహద్దుల వద్ద వేచి చూస్తున్నారు. వారి కథలు అక్రమ వలసల వెనుక ఉన్న మానవ విషాదాన్ని, అదే సమయంలో దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాన్ని కళ్లకు కడుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande