
హైదరాబాద్, 07 మే (హి.స.)
జగిత్యాల జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలకు గుర్తింపు పొందింది. ఆలయ పరిపాలన, పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు, భక్తులకు అందిస్తున్న సేవలు, నిర్వహణ వ్యవస్థలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ISO) ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఐఎస్వో ప్రతినిధులు రామలక్ష్మి, సత్యసాయి చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్. అంజనా రెడ్డి స్వీకరించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా చేపట్టిన చర్యలకు గుర్తింపుగా ఈ ధ్రువీకరణ లభించడం విశేషమని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు దర్శించుకునే ఈ పవిత్ర క్షేత్రానికి ఐఎస్వో ధ్రువీకరణ లభించడం ద్వారా ఆలయ సేవలకు మరింత విశ్వసనీయత, అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లు భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు