
హైదరాబాద్, 07 మే (హి.స.)ప్రతి ఒక గ్రూపుకు వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. ప్రతి ఒక మహిళా సంఘం తీసుకుని 10 లక్షల రూపాయల బ్యాంకు రుణాలకు వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తోందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. మహిళా సంఘాల రుణాలకు ఈ ఏడాది వడ్డీల కోసం 2500 కోట్లు ఖర్చు చేస్తామని సీతక్క వెల్లడించారు. మహిళా ఉన్నత తెలంగాణ ప్రగతి అన్న నినాదంతో మా ప్రభుత్వం పని చేస్తుందని, మహిళల ఆర్థిక సాధికారత కోసం యజ్ఞంలా పని చేస్తున్నామని ఆమె తెలిపారు. మహిళలు పేదరికం నుంచి బయటపడినప్పుడే అభివృద్ధి పరిపూర్ణమవుతుందని, అందుకే వడ్డీ లేని రుణాలు ఇప్పించి ఆర్థికంగా మహిళలను ఎదిగేలా చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో పనిచేస్తున్నామని, అన్ని రంగాల్లో మహిళలకు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పంట కొనుగోలు కేంద్రాల్లో 40% కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగించామని, ఈ ఏడాది 26 వేల కోట్లకు పైగా మహిళలకు బ్యాంకు రుణాలు ఇస్తామని ఆమె వెల్లడించారు.
అంతేకాకుండా.. ‘మహిళల ఆర్థిక సాధికారతలో ఇదో మైలురాయి.. లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా.. గతంలో మహిళలకు పట్టుమని పదివేల రూపాయల లోన్లు కూడా లభించకపోయేవి.. ఇప్పుడు ఆ మహిళలకి బ్యాంకులు లక్షలాది రూపాయలు ఇస్తున్నాయి.. పేదరికం వల్లే నేను నక్సలైట్లలో చేరాను.. వడ్డీ వ్యాపారుల దోపిడి కారణంగా సామాన్యులు నష్టపోయారు.. వారి బాధ చూడలేక నేను తుపాకిపట్టాను.. ఆ అనుభవంతోనే మహిళలకు వడ్డీ లేని రుణాలు కల్పించాలని సంకల్పంతో పనిచేస్తున్నాము.. ఇప్పటివరకు అర్హత గల మహిళా సంఘాలకు ఐదు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు కల్పించాము.. ఇప్పుడు ఆ మొత్తాన్ని 10 లక్షల రూపాయలకు పెంచుతున్నాము.. మహిళా సంఘాలకు లోన్ లిస్టు సహకరిస్తున్న బ్యాంకర్లందరికి ధన్యవాదాలు..’ తెలిపారు మంత్రి సీతక్క.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్