
కర్నూలు, 07 మే (హి.స.)దేశ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. 10 తర్వాత బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్నం ఎండలు 40 డిగ్రీలు పైనే నమోదు అవుతున్నాయి. ఎండల కారణంగా జనం అనారోగ్యం పాలవుతున్నారు. వడదెబ్బ కొట్టడంతో పాటు తలనొప్పి, చర్మ సమస్యలు, గుండె వేగంగా కొట్టుకోవటం, తల తిరగటం, వాంతులు అవ్వటం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వడదెబ్బ కారణంగా ప్రాణాలు సైతం పోతున్నాయి.
ఎర్ర ఉల్లి మేలు మరువలేం..
ఎండాకాలంలో ఎర్ర ఉల్లిపాయలు తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ‘మాలెక్యులస్ జర్నల్’లో ప్రచురితం అయిన వివరాల మేరకు.. ఎర్ర ఉల్లిపాయల్లో ప్రొటీన్, ఫెనోలిక్ కాంపౌండ్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వేడి తాలూకా ప్రభావాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు.. ఎర్ర ఉల్లిపాయలు తినటం వల్ల శరీరానికి ఎండ వేడిని ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. ఎండలో ఎక్కువ సేపు ఉండటం వల్ల శరీరం పెద్దమొత్తంలో నీరు, మినరల్స్ను కోల్పోతుంది.
ఎర్ర ఉల్లిపాయల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఆ నీటిలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. తినే ఆహారంలో ఎర్ర ఉల్లిపాయలను భాగం చేసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన నీటితో పాటు మినరల్స్ కూడా అందుతాయి. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఎర్ర ఉల్లిపాయల తాలూకా లాభాలు మన శరీరానికి అందాలంటే వాటిని పచ్చిగానే తీసుకోవాలి. పెరుగన్నం, ఉల్లిపాయలు తినటం వల్ల శరీరం చల్లబడుతుంది. పాంక్రియాస్ సమస్య ఉన్న వారు ఉల్లిపాయలకు దూరంగా ఉండటం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV