పశ్చిమ బెంగాల్ లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు..పవన్ కళ్యాణ్ పోస్ట్
పశ్చిమ బెంగాల్ లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు..పవన్ కళ్యాణ్ పోస్ట్
పశ్చిమ బెంగాల్ లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు..పవన్ కళ్యాణ్ పోస్ట్


అమరావతి, 09 మే (హి.స.)

అమరావతి:పశ్చిమ బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ఈ చరిత్రాత్మక విజయాన్ని సాధించడానికి సంవత్సరాల తరబడి పోరాటం చేశారన్నారు. దీనికి దృఢంగా నిలిచిన బీజేపీ బెంగాల్ నాయకత్వానికి, పార్టీ కార్యకర్తలకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ పోస్ట్..

'ప్రజాకేంద్రిత పాలనను అందించడంలో నూతన బీజేపీ ప్రభుత్వం విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. దీనిని కేవలం బీజేపీ లేదా పశ్చిమ బెంగాల్ విజయంగానే కాకుండా, భారత ప్రజల గెలుపుగా భావిస్తున్నాను. సంవత్సరాలుగా హింస, అరాచకం, అక్రమ వలసలు, తీవ్రవాద చొరబాట్లపై పెరుగుతున్న ఆందోళనలకు పశ్చిమ బెంగాల్ సాక్ష్యంగా నిలిచింది. ఇవి సామాజిక సామరస్యం, జాతీయ భద్రతకు తీవ్రమైన సవాళ్లను విసిరాయి. ఇలాంటి కీలక సమయంలో జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, బలమైన పాలనతో ఈ సవాళ్లను పరిష్కరించడానికి ఇచ్చిన ఈ ప్రజా తీర్పు గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఈ సందర్భంగా భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమానికి సైద్ధాంతిక పునాది వేసిన దార్శనికుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీకి నా నివాళులు. శ్యామా ప్రసాద్ జన్మస్థలమైన పశ్చిమ బెంగాల్లో బీజేపీ సాధించిన విజయం.. ఆయన దార్శనికత, సిద్ధాంతానికి తగిన నివాళిగా నిలుస్తోంది. ఈ ప్రజా తీర్పు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ అద్భుతమైన విజయానికి దోహదపడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య, ప్రతి బీజేపీ కార్యకర్తకు నా హృదయపూర్వక అభినందనలు' అంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande