
అమరావతి, 10 జూన్ (హి.స.)
అమరావతిలో సీజీపీవోఏ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుసోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలను మరింత బలోపేతం చేస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ఆయా విభాగాల మధ్య సమన్వయం పెరిగి, ప్రజలకు సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన ప్రోత్సాహకంగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. రాజధాని నగరానికి అవసరమైన పరిపాలనా మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని వివరించారు.
ఒకే చోట అనేక కేంద్ర కార్యాలయాలు ఉండటంతో పని తీరులో వేగం, సౌలభ్యం పెరుగుతుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సుస్థిరమైన, ఆధునిక ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు ఇది మరో కీలక మైలురాయి అని అభివర్ణించారు. ఏపీలో ప్రపంచ స్థాయి ప్రజా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం నుంచి అందుతున్న మద్దతుకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ