
కర్నూలు, 11 జూన్ (హి.స.)
కర్నూలు నగరపాలక సంస్థ అందిస్తున్న సేవలపై ప్రజలు సంతృప్తి చెందడమే ఉద్యోగుల పనితీరుకు నిజమైన కొలమానమని కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు.
ఈ రోజు పాతబస్తీలోని 3వ శానిటేషన్ డివిజన్ మస్టర్ను తనిఖీ చేశారు. అనంతరం బొంగుల బజార్, గౌలిగేరి, మండిబజార్, ఖడక్పూర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా అంశాలపై ఆరా తీశారు. ప్రజల ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించారు. సచివాలయ సిబ్బందిపై ఫిర్యాదులు రావడంపై సంబంధిత సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. పనితీరును మరింత మెరుగుపరచుకోవాలని హితవు పలికారు.
కాగా, బొంగుల బజార్లో ఓ నివాసితురాలు మార్చి నెలలో సచివాలయ అడ్మిన్కు ఆస్తి పన్ను చెల్లింపునకు నగదు ఇవ్వగా, దానిని చెల్లించకుండా, తిరిగి ఇవ్వకుండా, ఫోన్ కాల్స్కు స్పందించకుండా ఇబ్బంది పెట్టారని వాపోయారు. ప్రస్తుతం అతను బదిలీ అయిపోయాడని, గత్యంతరం లేక మరోసారి నగదు చెల్లించి ఆస్తి పన్ను చెల్లించామని తెలిపారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన కమిషనర్, ప్రస్తుతం విధుల్లో ఉన్న అడ్మిన్ ఈ సమస్యను పరిష్కరించాలని, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడి బాధ్యతగా సంబంధిత మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని సూచించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఇంటింటి చెత్త సేకరణ, పూడికతీత వంటి పారిశుద్ధ్య పనులకు ఆటంకం కలిగేలా డ్రైనేజీ కాలువలు, రహదారులపై ఆక్రమణలు చేయడం సరికాదన్నారు. ప్రజలు సహకరించి మెరుగైన పారిశుద్ధ్య పనులకు ఆటంకం లేకుండా చూడాలని కోరారు. పారిశుద్ధ్య పర్యవేక్షక సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. . ఆటంకాలు ఉన్నాయని సమస్యలను అలాగే వదిలేయడం సరికాదని, ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుని వాటిని పరిష్కరించాలని హితవు పలికారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV