
హైదరాబాద్, 12 జూన్ (హి.స.)
హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ సాయి బాబా గుడి పరిసర ప్రాంతాలు శుక్రవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల సంఖ్యను భారీగా పెంచాలంటూ వందలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు రోడ్డుపైకి వచ్చి అకస్మాత్తుగా ధర్నాకు దిగారు. కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 5 వేల నుండి 20 వేలకు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, నిరుద్యోగ అభ్యర్థులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. రోడ్డుపై బైఠాయించిన అభ్యర్థులను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పోలీస్ స్టేషను తరలించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది.
ఈ సందర్భంగా నిరుద్యోగ సంఘాల నాయకులు, అభ్యర్థులు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 5 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తామని చెప్పడం నిరుద్యోగులను నట్టేట ముంచడమే అని మండిపడ్డారు. ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకుంటూ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న తమకు ఈ అరకొర పోస్టులు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. పోస్టుల సంఖ్య పెంచడంతో పాటు, పోలీస్ నియామకాల్లో వయోపరిమితి (Age Limit) సడలింపుపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన వయోపరిమితి సడలింపులను ఈ ప్రభుత్వం ఎందుకు తగ్గించిందో సమాధానం చెప్పాలన్నారు. తక్షణమే ఏజ్ లిమిట్ పెంచకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని, నోటిఫికేషన్లను సవరించి 20 వేల కానిస్టేబుల్ పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..