
తాడిపత్రి, 12 జూన్ (హి.స.)
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిపక్ష వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తోంది. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలకు వైసీపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టగా ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన తెలిపితే.. టీడీపీ విజయోత్సవ బైక్ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో నడిరోడ్డుపై కూర్చుని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్ది ఆందోళన చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి అనంతపురానికి తరలించారు. కేతిరెడ్డి తాడిపత్రి రావడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వార్ జరుగుతుండంతో ఎప్పుడు ఏం జరుగుతుందా అని నియోజకవర్గంలో ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV