తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఫుల్
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఫుల్
తిరుమల


తిరుమల , 13 జూన్ (హి.స.)

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి (Tirumala Tirupati)లో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు పూర్తి కావస్తున్న తరుణంలో వీకెండ్ (వారాంతం) కావడం వల్ల కొండపై యాత్రికుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. దీంతో క్యూ కాంప్లెక్స్ వెలుపల ఉన్న నారాయణగిరి షెడ్లలోని క్యూలైన్లలో భక్తులు కిలోమీటర్ల మేర దర్శనం కోసం వేచి ఉన్నారు. ఎలాంటి టైమ్ స్లాట్, ఉచిత దర్శన టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ (TTD) అధికారులు నిరంతరాయంగా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలను అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే నిన్న (శుక్రవారం) ఒక్క రోజే మొత్తం 74,636 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి తమ భక్తిపూర్వక మొక్కులలో భాగంగా 43,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో రూ. 4.64 కోట్ల భారీ ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతున్నందున శని, ఆదివారాల్లో కూడా ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, భక్తులు గమనించి తమ తిరుమల ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande