
అమరావతి, 14 జూన్ (హి.స.)
రంపచోడవరం, గోదావరి నదిలో పర్యాటక బోట్ల నిర్వహణపై భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా పాపికొండలకు వెళ్లే పర్యాటక బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రంపచోడవరం ఆర్డీవో స్వాతి ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి ఓ బోటులో దాదాపు 89 మంది పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. దేవీపట్నం పాత పోలీసుస్టేషన్ ప్రాంతానికి వెళ్లేసరికి సాంకేతిక లోపం ఏర్పడటంతో అప్రమత్తమైన సరంగు (డ్రైవర్) బోటును నిలిపివేశారు. దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు బోట్ల ఫిట్నెస్, భద్రతా ప్రమాణాలపై పరిశీలన చేయిస్తున్నారు. వీటిపై నివేదిక వచ్చాకే.. బోట్లకు అనుమతులు ఇస్తామని ఆర్డీవో తెలిపారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ