
అమరావతి , 16 జూన్ (హి.స.)వచ్చే నెలలో 'తల్లికి వందనం' పథకం అమలుకు చర్యలు
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలని మంత్రి లోకేష్ ఆదేశం
జూన్ 29న షైనింగ్ స్టార్స్, జులైలో మెగా పీటీఎం నిర్వహణకు నిర్ణయం
వివిధ 'సెట్'లను సకాలంలో నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖకు సూచన
ఏపీకి ఎన్సీసీ స్టేట్ డైరెక్టరేట్ మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు
రాష్ట్ర విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి, విద్యార్థులకు నాణ్యమైన భవిష్యత్తును అందించే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించే 'తల్లికి వందనం' పథకాన్ని జులై మూడో వారంలో అమలు చేసేందుకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు, పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు పలు కీలక అంశాలపై మంత్రి దిశానిర్దేశం చేశారు.
ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాల, ఉన్నత విద్యాశాఖల అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. 'తల్లికి వందనం' పథకం అమలుపై ప్రధానంగా చర్చించారు. తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, జులై మూడో వారంలో పథకాన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు మంత్రికి వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi