
రేణిగుంట, 16 జూన్ (హి.స.)మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా రేణిగుంటలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థానిక ప్రైవేట్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి రేణిగుంట డీఎస్పీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యం వహించగా,సీఐ జయచంద్ర పాల్గొని మహిళల భద్రతకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళలపై వేధింపులు,సైబర్ నేరాల నుంచి రక్షణ, అత్యవసర సమయాల్లో వినియోగించాల్సిన సహాయక నంబర్లు,రక్షణ యాప్ల ఉపయోగం వంటి అంశాలను వివరించారు.ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని, అందుబాటులో ఉన్న భద్రతా సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ నిరంతరం కట్టుబడి పనిచేస్తోందని,సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి మహిళలకు భరోసా కల్పించాలని అధికారులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు మహిళలు, యువతులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV