
కర్నూలు, 17 జూన్ (హి.స.)అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఏపీకి చెందిన యువకుడిని స్కైడైవింగ్ ప్రమాదం బలితీసుకుంది.
అమెరికాలోని మిస్సోరీ, కాన్సాస్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో పైలట్తో సహా 12 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఏపీకి చెందిన దట్ల సాయి కార్తీక్ వర్మ అనే యువకుడు కూడా ఉన్నట్లు సమాచారం అందడంతో అతని స్వస్థలంలో తీవ్ర విషాదం అలముకుంది. సరదా.. విషాదంగా ముగిసింది బాధితుడి కుటుంబ వివరాల ప్రకారం.. మృతుడు దట్ల సాయి కార్తీక్ వర్మ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఇటీవలే అతని కుటుంబం కర్నూలు జిల్లా కౌతాళం మండలం రాజానగర్ క్యాంప్లో స్థిరపడింది.
సాయి కార్తీక్ వర్మ అమెరికాలోని 'యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీ'లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఇటీవలే అక్కడ ఒక మంచి ఉద్యోగంలో చేరాడు. వీకెండ్ కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా స్కైడైవింగ్ (Skydiving) చేయడానికి వెళ్లిన సమయంలో ఈ ఊహించని దుర్ఘటన జరిగింది.
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే.. స్కైడైవర్లను తీసుకెళ్లే 'పసిఫిక్ ఏరోస్పేస్ P750' (Pacific Aerospace P750) రకానికి చెందిన చిన్న విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపంతో అదుపుతప్పి భూమిపైకి కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్తో పాటు 11 మంది స్కైడైవర్లు ఉన్నారు. విమానం వేగంగా వచ్చి భూమిని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి లోపల ఉన్న 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు కంటికి రెప్పలా పెంచిన కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉన్నత స్థితికి చేరుకుంటాడనుకుంటే, ఇలా విగతజీవిగా మారాడనే వార్త వినడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. సాయి కార్తీక్ వర్మ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు, స్నేహితులు అక్కడి అధికారులతో మాట్లాడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మృతదేహాన్ని త్వరగా భారత్కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV