
కర్నూలు, 18 జూన్ (హి.స.)కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి దేవనకొండ, పత్తికొండ మండలాల్లో పర్యటించి వ్యవసాయ, ఉద్యానవన రంగాలకు సంబంధించిన పలు కార్యక్రమాలను పరిశీలించారు.
దేవనకొండ మండలంలోని కరివేముల గ్రామంలో రైతు సదాశివరావు హై-డెన్సిటీ ప్లాంటేషన్ విధానంలో సాగు చేస్తున్న మామిడి తోటను సందర్శించిన కలెక్టర్, ఆధునిక సాగు విధానాలను రైతులకు మరింతగా చేరువ చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం దేవనకొండ మండల కేంద్రంలో రైతు బడి గింజల రంగన్న 16 ఎకరాల్లో సాగు చేస్తున్న హైబ్రిడ్ కొబ్బరి తోటను పరిశీలించారు. మిశ్రమ, అంతర పంటల సాగు ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తోందని పేర్కొంటూ, అంతర పంటల సాగు మరియు మైక్రో ఇరిగేషన్ విధానాలను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం పత్తికొండ మండలం కనకదిన్నె గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కేంద్రాన్ని పరిశీలించి, నిర్మాణ పనులను రెండు నెలలో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా దేవనకొండ మండల కేంద్రంలోని మన గ్రోమోర్ యూరియా విక్రయ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, APIMS యాప్ ద్వారా రైతుల వివరాల నమోదును పరిశీలించారు.
కలెక్టర్ పర్యటన సందర్భంగా సీపీఐ దేవనకొండ మండల కార్యదర్శి నరసారావు వినతిపత్రం అందజేశారు.
దేవనకొండలోని డీఎన్టీఎ హాస్టల్ను పునరుద్ధరించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు ఎరువులు గిట్టుబాటు ధరలకు అందుబాటులో ఉంచి, ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV