
హైదరాబాద్, 19 జూన్ (హి.స.)
తెలంగాణవ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు, ఇతర అనుబంధ ఆన్లైన్ సేవలు మూడు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. సర్వర్ల నిర్వహణ, అప్గ్రేడేషన్ పనుల కారణంగా జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ స్పష్టం చేసింది.
దాదాపు ఐదేళ్ల తర్వాత చేపడుతున్న ఈ కీలకమైన నిర్వహణ పనుల ద్వారా సర్వర్ల పనితీరును, భద్రతను మరింత మెరుగుపరచనున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. భవిష్యత్తులో ప్రజలకు మరింత వేగవంతమైన, సులభతరమైన సేవలు అందించడమే ఈ అప్గ్రేడేషన్ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు.
ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ షట్డౌన్ను సెలవు దినాల్లో నిర్ణయించారు. జూన్ 26న మొహర్రం పబ్లిక్ హాలిడే, జూన్ 28 ఆదివారం కావడంతో కేవలం ఒకే ఒక పనిదినమైన జూన్ 27 (శనివారం) మాత్రమే సేవలపై ప్రభావం పడనుంది. ఇప్పటికే జూన్ 27వ తేదీ కోసం స్లాట్లు బుక్ చేసుకున్న వారికి, వాటిని జూన్ 25వ తేదీకి మార్చినట్లు అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi