
కర్నూలు, 20 జూన్ (హి.స.) తెలుగు రాష్ట్రాల్లో ఎండలతో పాటు వర్షాలు సైతం కురుస్తున్నాయి. ఇప్పటికే రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వడంతో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కావడంలేదు. అయితే గత రెండు రోజులుగా ఎండలు మండిపోతుండగా నేటి నుండి మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, కాకినాడ, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనావేసింది.
ఇక తెలంగాణలోనూ నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ అంచనా వేశారు. రాష్ట్రంలో సెంట్రల్ తెలంగాణ, దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణ్ పేట్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగాం, కామారెడ్డి జిల్లాల్లో సాయంత్రం నుండి రాత్రి సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ముఖ్యంగా అర్ధరాత్రులు భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇక హైదరాబాద్ లోనూ రాత్రి సమయంలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV