
అమరావతి 21 జూన్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రైతులను వంచిస్తోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'అన్నదాత సుఖీభవ' పథకం కింద అరకొర నిధులు విడుదల చేసి, వరుసగా మూడో ఏడాది కూడా రైతులకు అన్యాయం చేశారని ఆమె ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 20న 'అన్నదాత సుఖీభవ' పథకం కింద మొదటి విడత ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది. పీఎం-కిసాన్ పథకం నిధులతో కలిపి సుమారు 46.86 లక్షల రైతు కుటుంబాలకు ఈ ప్రయోజనం చేకూరింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5,000, కేంద్రం వాటాగా రూ.2,000 కలిపి ప్రతి లబ్ధిదారుడికి మొత్తం రూ.7,000 చొప్పున అందాయి.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన షర్మిల, ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది అర్హులైన రైతులు ఉండగా, కేవలం కొంతమందికి మాత్రమే నిధులు కేటాయించారంటూ ఆమె ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన పెట్టుబడి సాయం, కనీస మద్దతు ధర, పంటల బీమా వంటి వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ఇచ్చిన మాట తప్పినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆమె సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi