ఆదరణ పథకంలో భాగంగా రూ .1000 కోట్లు కేటాయించాము..మంత్రి సవిత
ఆదరణ పథకంలో భాగంగా రూ .1000 కోట్లు కేటాయించాము..మంత్రి సవిత
Savita


అమరావతి, 24 జూన్ (హి.స.)

ఆదరణ పథకంలో భాగంగా రూ.1000 కోట్లు కేటాయిస్తున్నామని ఏపీ మంత్రి సవితప్రకటించారు. గతంలో ఆదరణ పథకంలో వస్తువులు ఇచ్చామని.. ఇప్పుడు ఆదరణ పథకం ద్వారా బీసీ విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ రెండేళ్ల ప్రగతిపై ఈరోజు (బుధవారం) మీడియా సమావేశం ఏర్పాటు చేసి మంత్రి సవిత వివరాలు వెల్లడించారు. కూటమి ప్రభుత్వాన్ని సుపరిపాలన కోసం సంపూర్ణ మెజార్టీతో ప్రజలు గెలిపించారని తెలిపారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ నాటి నుంచి.. నేడు చంద్రబాబు వరకూ బీసీలను అక్కున చేర్చుకున్నారని చెప్పుకొచ్చారు. బీసీలు అంటే రాష్ట్రానికి బ్యాక్ బోన్ అని... వారు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని వివరించారు. కూటమి అధికారంలోకి వచ్చాక రూ.39వేల కోట్లని బీసీ విద్యార్థులకు కేటాయించామని తెలిపారు.

తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్లో రూ.47వేలు, మూడో బడ్జెట్లో రూ. 51వేల కోట్లు కేటాయించి తమ చిత్తశుద్దిని నిరూపించుకున్నామని మంత్రి సవిత వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదనంగా 10 గురుకుల పాఠశాలలను కేటాయించామని ప్రస్తావించారు. తద్వారా 5వేలమంది విద్యార్థులకు విద్య లభిస్తుందని అన్నారు. ఈ ఏడాది పదోతరగతిలో 96శాతానికిపైగా.. ఇంటర్ ఫలితాల్లో కూడా ముందు వరుసలో బీసీ గురుకులాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. నీట్, ఐఐటీ కోచింగ్ కోసం విద్యార్థులకు ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

ఆరు గురుకుల పాఠశాలల నుంచి అమ్మాయిలు డ్రాపౌట్ అవ్వకూడదని.. అక్కడ ఇంటర్మీడియట్ విద్యను కూడా అందిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. వివిధ దశల్లో ఉన్న ఎంజేపీ స్కూళ్లను బీసీ విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. రూ.60కోట్లతో బీసీ గురుకులాల్లో మౌలిక వసతులు కల్పించామని అన్నారు. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా హాస్టల్లో 974 టాయిలెట్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలను కూడా అన్నిరకాలుగా ప్రోత్సహిస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande