
హైదరాబాద్, 25 జూన్ (హి.స.) ఆదాయానికి మించిన ఆస్తుల
కేసులో శామీర్పేట తహశీల్దార్ (సస్పెండెండ్) సుచరిత నివాసంలో ఏసీబీ అధికారులు మరోసారి నేడు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కళ్లు చెదిరే రీతిలో అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. స్థానిక రైతులకు చెందిన 30 ఎకరాలను వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు సుచరిత రూ.30 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన అవినీతి నిరోధకశాఖ అధికారులు డిమాండ్ చేసిన డబ్బులలో తొలి విడతగా రూ. 2 లక్షల సొమ్మును ప్రైవేట్ డ్రైవర్ ద్వారా తీసుకుంటుండగా పట్టుబడ్డారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన ఏసీబీ అధికారులు తాజాగా గురువారం మరోసారి ఆమె నివాసంలో తనిఖీలు చేపట్టారు.
ఈరోజు (మరియు గతంలో మే 26న) ఆమె నివాసంలో జరిపిన తనిఖీలలో ఆమె భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం దామరకుంట గ్రామంలో 2 ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూమి. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలలో 3 ఫ్లాట్లు. కీసర, ఖానామెట్ గ్రామాలలో 2 ఓపెన్ ప్లాట్లు. రూ. 12 లక్షల నెట్ క్యాష్ బ్యాంకు ఖాతాలలో రూ. 38 లక్షల బ్యాలెన్స్ ఉన్నట్లు గుర్తించారు. అలాగే దాదాపు రూ. 1.20 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఒక వోక్స్వ్యాగన్ కారు, ఒక హ్యుందాయ్ క్రెటా కారు ఉన్నట్లు గుర్తించారు. వీటికి సంబంధించిన కీలక పత్రాలు సైతం స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది. డాక్యుమెంట్ల ప్రకారం ఏసీబీ అధికారులు గుర్తించిన మొత్తం ఆస్తుల విలువ రూ. 5.5 కోట్లకు పైనే ఉంటుందని మార్కెట్ విలువ ప్రకారం వీటి ధర ఈ డాక్యుమెంట్ వాల్యూ కంటే మరికొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆమెకు సంబంధించిన మరికొన్ని అదనపు ఆస్తుల వెరిఫికేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు