
తిరుపతి, , 24 జూన్ (హి.స.) మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులో సీఐడీ దర్యాప్తు పూర్తి కావొచ్చిందని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.
ఈ రోజు బుధవారం తిరుపతి సమీపంలోని తిరుచానూరులో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూముల రీ సర్వే 2.0 త్వరలో ప్రారంభమవుతుందని అన్నారు. వివాదంలో ఉన్న భూములను పరిష్కరిస్తామని ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు.
మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఏడాది కిందట జరిగిన దామినేడు భూ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తెచ్చారని విమర్శించారు. తిరుపతిలో జరిగిన కూటమి సభ సక్సెస్ కావడంతో తనపై ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. చంద్రగిరి ఎమ్మెల్యే నాని, తాను ఇలాంటి ఆరోపణలకు భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.
భూములు కొనుగోలు చేసిన వ్యక్తికి.. తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కేసులు పెట్టామని వివరించారు. ఏ ఇద్దరు కలిసి ఉండడం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు ఇష్టం ఉండదని చెప్పారు. వైఎస్ జగన్ స్పైడర్ సినిమాలో సైకో విలన్లాగా ప్రవర్తిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టడమే గొడ్డలి పార్టీ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV