
నల్గొండ, 24 జూన్ (హి.స.)
నల్గొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన కోటి 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ మరియు ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.అంతేకాక 2 సిటీ బస్సులను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణంలోని మహిళలు షాపింగ్, ఇతర అవసరాల కోసం రాకపోకల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సిటీ బస్సు సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఆస్పత్రికి చేరుకోవడానికి ఆటోలపై ఆధారపడాల్సి వచ్చేదని, ఇకపై వారు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని చెప్పారు.
సిటీ బస్సు సర్వీసులు చెరువుగట్టు-ఎస్ఎల్బీసీ మార్గంతో పాటు ధరవేశి పురం నుంచి దుప్పలపల్లి వరకు నడిచేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.నల్గొండకు అదనంగా 30 బస్సులు కేటాయించడం జరిగిందని, 56 మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఎల్బీసీ వద్ద పెట్రోల్ పంపు, ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్, రెస్టారెంట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. బస్టాండ్ విస్తరణలో భాగంగా కొత్త కౌంటర్లు, వెయిటింగ్ గార్డెన్, బాత్రూములు, టాయిలెట్లు, ఆధునిక ప్లాట్ఫారాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ పనుల కోసం అదనంగా రూ.5 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. పట్టణ అభివృద్ధికి రూ.83 కోట్ల రూపాయలతో తాగునీటి శుద్ధి (వాటర్ ఫిల్టర్) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..