సరిపడ యూరియా ఇవ్వకపోతే బీజేపీ నాయకుల ఇళ్ల ముందు కూర్చుంటాం: మంత్రి పొన్నం
సరిపడ యూరియా ఇవ్వకపోతే బీజేపీ నాయకుల ఇళ్ల ముందు కూర్చుంటాం: మంత్రి పొన్నం
Minister


హైదరాబాద్, 24 జూన్ (హి.స.)

రాష్ట్రానికి సరిపడా యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, ఒక వేళ తెలంగాణకు సరిపడా యూరియా ఇవ్వకపోతే బీజేపీ నాయకుల ఇళ్ల ముందు కూర్చుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. రాష్ట్రానికి సరిపడా యూరియా వచ్చేలా బీజేపీ ఎంపీలు కృషి చేయాలన్నారు. దేశం మొత్తం కేంద్రమే యూరియా సప్లై చేస్తుందని, కేంద్రం యూరియా ఇస్తే రాష్ట్రాలు సప్లై చేస్తాయన్నారు. ఇవాళ గాంధీ భవన్లో మంత్రితో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

రాష్ట్రానికి ఎరువులు వచ్చిన రాకపోయినా బీజేపీ నాయకత్వానిదే బాధ్యత అని, ముఖ్యమంత్రి.. మంత్రులు తెలంగాణకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని అనేక సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేదని, మిత్రపక్షంగా లేమని వివక్ష చూపుతోందని ఆరోపించారు. యూరియా, ఎరువులపై కేంద్రంలో ఏ మంత్రిని అయినా కలవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎరువుల కేటాయింపులు లేకపోతే బరాబర్ కేంద్రంతో కోట్లాడుతామన్నారు. కల్తీ విత్తనాలు లేకుండా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తున్నామని దుష్ప్రచారం ద్వారా ఎరువుల సరఫరాలో రాష్ట్రాన్ని బధ్నాం చేయాలని చూస్తున్నారని రైతులు విపక్షల మాటలు నమ్మొద్దన్నారు. రామగుండంలో ఉత్పత్తైన ఎరువులు పూర్తి స్థాయిలో తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గతంలో రేషన్ కార్డులు కావాలని వేలాది అప్లికేషన్లు వచ్చాయని ఇప్పుడు రేషన్ కార్డు కావాలని ఒక అప్లికేషన్ కూడా రాలేదన్నారు. భూసమస్యలు, కొత్త పెన్షన్లపై అప్లికేషన్లు వస్తున్నాయని చెప్పారు. కొత్తగా 2 లక్షల పెన్షన్లు మంజూరు చేశామని కొత్త పెన్షన్లపై వినతి పత్రాలు వచ్చాయని త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. మా ప్రభుత్వం వచ్చాక అర్హత కలిగిన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. సన్న బియ్యం, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పంపిణీ చేస్తున్నామన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande