
దేవనకొండ, 04 జూన్ (హి.స.)
దేవనకొండ మండల ఎంపీడీవో కార్యాలయంలో ఈ రోజు ఉదయం ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR-2026) కార్యక్రమంపై బూత్ లెవల్ అధికారులు (BLOలు) మరియు సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ వై.కే. రామేశ్వర రెడ్డి మాట్లాడుతూ, ప్రతి బీఎల్ఓ తమ విధులను నిబద్ధతతో, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా నిర్వహించాలని సూచించారు.
దేవనకొండ మండలం రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు పొందేలా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్ఏల వివరాలను నమోదు చేస్తూ, SIR మ్యాపింగ్ను ఎలా నిర్వహించాలనే అంశాలపై బీఎల్ఓలకు వివరంగా అవగాహన కల్పించారు.
విధుల నిర్వహణలో ఏవైనా సందేహాలు తలెత్తితే సూపర్వైజర్ల సహాయం తీసుకోవాలని సూచించారు. అలాగే SIR-2026 కార్యక్రమానికి సంబంధించిన బీఎల్ఓ కిట్లను త్వరలో బీఎల్ఓలకు అందజేయనున్నట్లు తెలిపారు.
దేవనకొండ మండలంలో మొత్తం ఓటర్ల సంఖ్య 59,577 కాగా, ఇప్పటి వరకు 52,095 మంది ఓటర్ల వివరాలు మ్యాపింగ్ చేయబడినట్లు వెల్లడించారు. ఇది 87.44 శాతం పురోగతిగా పేర్కొంటూ, మిగిలిన ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో బీఎల్ఓలు, సూపర్వైజర్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV