
హైదరాబాద్, 05 జూన్ (హి.స.) హైదరాబాద్ మహానగరంలో పేద, మధ్యతరగతి ప్రజలకు చౌకైన ప్రయాణ సాధనంగా ఉన్న ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లలో ఉచిత ప్రయాణాన్ని తీసుకురావాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆలోచనకు రైల్వే బోర్డు (Railway Board) నుంచి చుక్కెదురైంది. జూన్ 2 నుంచి ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను రైల్వే బోర్డు తిరస్కరించింది. ఇప్పటికే తాము భారీ నష్టాల్లో నడుస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో ఉచిత ప్రయాణాలు సాధ్యం కాదని స్పష్టం చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాసింది.
రైల్వే అధికారులు పంపిన లేఖలో ఎంఎంటీఎస్ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని లెక్కలతో సహా వివరించారు. సర్వీసుల నిర్వహణ వల్ల కేవలం ఒక్క ఏడాదిలోనే దాదాపు రూ.160 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎంటీఎస్ ప్రాజెక్టులకు సంబంధించి తమకు చెల్లించాల్సిన రూ.490 కోట్ల పాత బకాయిలను కూడా ఇంకా చెల్లించలేదని రైల్వే బోర్డు లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని భావిస్తే.. దానికి సంబంధించిన పూర్తి ఆర్థిక భారాన్ని మోసేందుకు సిద్ధంగా ఉండాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఎంఎంటీఎస్ వ్యవస్థకు వచ్చే నష్టాల మొత్తాన్ని 100 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే.. ఆ ప్రతిపాదనకు తాము అంగీకరిస్తామని రైల్వే అధికారులు తేల్చిచెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు