
మెదక్, 05 జూన్ (హి.స.)
ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత
వేగవంతం చేయడంతో పాటు జనగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నార్సింగ్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, జనగణన ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు పూర్తయిన కేంద్రాల్లోని సిబ్బంది, వాహనాలు, హమాలీలను ధాన్యం నిల్వలు ఉన్న ఇతర కేంద్రాలకు తరలించి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.
అలాగే మిల్లుల్లో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనగణన కార్యక్రమం అత్యంత కీలకమైనదని పేర్కొన్న కలెక్టర్ ప్రజల వివరాలను క్షుణ్ణంగా సేకరించి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆన్లైన్ యాప్లో నమోదు చేయాలని సూచించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారం సక్రమంగా నమోదు కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంసీఎస్, డీఎసీ, ఆర్డీఓ, తహసీల్దార్తో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు