
చిత్తూరు, 05 జూన్ (హి.స.)
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం లో గజరాజులు మళ్లీ కలకలం సృష్టించాయి. మండల పరిధిలోని చిన్నగరిగపల్లి గ్రామ సమీపంలో జంట ఏనుగులు ఒక్కసారిగా పొలాల్లోకి చొరబడి హల్చల్ చేశాయి. చిన్నగరిగపల్లి సమీపంలోని ఒక పెద్ద మామిడి తోటపై ఈ ఏనుగులు దాడి చేశాయి. తోటలోకి ప్రవేశించిన ఏనుగులు అక్కడ ఉన్న మామిడి చెట్ల కొమ్మలను విరిచేస్తూ తీవ్ర విధ్వంసం సృష్టించాయి.
ఏనుగులు మామిడి చెట్లను పెద్ద ఎత్తున విరిచేయడంతో, చెట్లకు ఉన్న మామిడికాయలు అన్ని పూర్తిగా నేలరాలాయి. చేతికొచ్చిన పంట ఇలా గజరాజుల దాడిలో నాశనమవ్వడంతో తోట యజమానితో పాటు స్థానిక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో తరచూ ఏనుగులు దాడులు చేస్తుండటంతో పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని, తాము తీవ్ర ఆర్థిక నష్టాల్లో మునిగిపోతున్నామని రైతులు వాపోతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి, ఏనుగులను అడవిలోకి పంపేలా చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV