
అమరావతి, 07 జూన్ (హి.స.)
యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని యోగా ప్రాధాన్యాన్ని వివరించారు. ప్రధానమంత్రి పిలుపు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజలు తమ ఆరోగ్యాన్ని తామే కాపాడుకోవాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకమని ఆమె అన్నారు. యోగా భారతీయ సంస్కృతిలో వేల ఏళ్లుగా భాగమై ఉందని, దానిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని పేర్కొన్నారు.
14 రోజుల యోగాంధ్ర కార్యక్రమం
జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 14 రోజుల యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యోగా చేయడానికి ఖరీదైన పరికరాలు అవసరం లేదని, ఒక మ్యాట్ ఉంటే చాలని, పేద-ధనిక తేడా లేకుండా అందరూ యోగా సాధన చేయవచ్చని చెప్పారు. ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు ఒత్తిడి, డిప్రెషన్, గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని, వాటిని నియంత్రించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ