
హిందూపురం పట్టణం, 07 జూన్ (హి.స.)
: ఏపీలోని సత్యసాయి జిల్లాలో వందేభారత్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. హిందూపురం రైల్వేస్టేషన్ వద్ద రెండు ఆవులను వందేభారత్ ఎక్స్ప్రెస్ ఢీకొంది. కాచిగూడ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్దశబ్దం రావడంతో రైలును లోకోపైలట్ నిలిపేశారు. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న హిందూపురం రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రైలును క్షుణ్ణంగా పరిశీలించారు. ఆవుల కళేబరాలను పట్టాల పైనుంచి తొలగించారు. రైలు సురక్షితంగా ఉందని నిర్ధారించి ముందుకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు అరగంట అనంతరం వందేభారత్ తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ