
మదనపల్లె, 08 జూన్ (హి.స.) : అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని కోళ్లబైలు టు బాబు కాలనీలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ జాతరలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. జాతర ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు సోమవారం రాత్రి అమ్మవారి ఊరేగింపును ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
రేపు మంగళవారం భక్తిశ్రద్ధలతో కల్లుకుండ, ధీలు మోయు కార్యక్రమాలు జరగనున్నాయని, బుధవారం బాణాలు చెల్లించే కార్యక్రమం భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బోయకొండ గంగమ్మ అమ్మవారి కృపతో గ్రామ ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నిర్వహిస్తున్న ఈ జాతరలో పరిసర గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.
జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. అమ్మవారిపై భక్తి, విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే ఈ జాతరను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV