
విశాఖపట్నం, 09 జూన్ (హి.స.)
, విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనాస్థలిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ప్రమాదానికి ముందే.. మరో ఘటన జరిగిందని కార్మికులు చెప్పారన్నారు. ఇలాంటి ఘటన గత 33 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేట్పరం కాకూడదన్నదే తమ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతర నిఘా ఉండాలన్నారు. విచారణ కమిటీ నివేదిక వచ్చాక చర్యలు తీసుకోనున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అంతకు ముందు, స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలుగా అండగా ఉంటామని పవన్ భరోసా ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ